న్యూఢిల్లీ, నవంబర్ 17: కమోడిటీస్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ను పునర్వ్యవస్థీకరించనున్నారు. బిలియనీర్ అనిల్ అగర్వాల్ ప్రమోట్ చేసిన వేదాంత… పలు లోహాల్ని, చమురును ఉత్పత్తి చేస్తున్నది. వీటిలో అల్యూమినియం, ఇనుము ఉక్కు, చమురు సహజవాయువు వ్యాపారాల్ని ప్రధాన కంపెనీ నుంచి విభజించి, స్టాండెలోన్ కంపెనీలుగా లిస్ట్ చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు బుధవారం స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం అందించింది. షేర్హోల్డర్లకు విలువను చేకూర్చేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు నియమించిన కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా పునర్వ్యవస్థీకరణను చేపడుతున్నామని వేదాంత చైర్మన్ అగర్వాల్ తెలిపారు. వేదాంత లిమిటెడ్, మూడు ఇతర వ్యాపార సంస్థలు సమాంతరంగా, స్వతంత్రంగా పనిచేస్తాయన్నారు. వీటికి లండన్ కేంద్రంగా ఉన్న వేదాంత రిసోర్సెస్ మాతృసంస్థగా కొనసాగుతుంది. ఈ మూడు వ్యాపారాలకు మంచి వృద్ధి అవకాశాలున్నాయని, వ్యూహాత్మక భాగస్వామ్యాలతో సహా పలు ఆప్షన్లను కంపెనీ అన్వేషిస్తున్నదని చైర్మన్ తెలిపారు.