‘స్వీయ ప్రతిభతో ఎదిగిన వారిని నేను అభిమానిస్తాను. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగశౌర్య విభిన్నమైన కథాంశాలతో సొంత గుర్తింపును సాధించుకున్నాడు ’ అని అని అన్నారు అల్లు అర్జున్. బుధవారం హైదరాబాద్లో జరిగిన ‘వరుడు కావలెను’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించారు. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 29న విడుదలకానుంది. ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ గత రెండేళ్లుగా చిత్ర పరిశ్రమ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటున్నది. ఈ క్లిష్ట సమయంలో ఇండస్ట్రీని, మంచి సినిమాల్ని ప్రోత్సహించాలనే ఈ వేడుకకు వచ్చా. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇండస్ట్రీలు బాగుండాలి. అందరూ బాగుండాలి. నాగశౌర్య నటించిన అన్ని సినిమాలు చూశా. అతడి మాటల్లో, నటనలో కనిపించే అమాయకత్వం నాకు ఇష్టం. మంచి మనసున్న అతడు ఎప్పటికైనా పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నా.
తెలుగమ్మాయి అయిన రీతూవర్మ తొలి సినిమా నుంచి చక్కటి నటనతో రాణిస్తున్నది. అమ్మాయిలు ఇండస్ట్రీలో రాణించాలని నేను కోరుకుంటా. కేవలం హీరోయిన్లుగానే కాకుండా దర్శకనిర్మాణంతో పాటు ఇతర విభాగాల్లోనూ వారు ప్రతిభను చాటాలి. ముంబయిలో షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్స్లో యాభై శాతం అమ్మాయిలు కనిపించేవారు. మన దగ్గర అలాంటి సంస్కృతి వస్తే బాగుంటుందనిపించేది. లక్ష్మీసౌజన్యను చూస్తుంటే ఆ రోజులు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఆమె స్ఫూర్తితో మరింత మంది లేడీ డైరెక్టర్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలి. డిసెంబర్ 17న విడుదలవుతున్న ‘పుష్ప’ సినిమా అందరికి నచ్చాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘సినిమా పక్కా హిట్ అవుతుందని మాటిస్తున్నా. ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకంతో ఈ మాట చెబుతున్నా. 2009లో బన్నీని నేను మొదటిసారి కలిశాను. ‘డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్లాలి’ అని నా స్నేహితుడిని అడిగితే బన్నీ షెడ్కు వెళ్లమని చెప్పాడు. అక్కడికి వెళ్లి బన్నీని చూసి ఆశ్చర్యపోయా. తన కుడి చేయి విరిగినా కూడా బాధను భరిస్తూనే అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలంటే ఎంతో కష్టపడాలని ఆ సమయంలో అర్థం చేసుకున్నా. మా సినిమాతో పాటుగా విడుదలవుతున్న ‘రొమాంటిక్’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’ అని చెప్పారు.