‘వరుడు కావలెను’ మంచి సినిమా అవుతుందని బలంగా నమ్మాను. ఆ నమ్మకం నిజమవ్వడం ఆనందంగా ఉంది. కుటుంబ ప్రేక్షకుల్ని ఈ సినిమా మెప్పిస్తున్నది. వారి హృదయాలకు నన్ను మరింత దగ్గర చేసిన చిత్రమిది’ అని అన్నారు నాగశౌర్య. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. రీతూవర్మ కథానాయికగా నటించింది. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం హైదరాబాద్లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ ‘నిజజీవితంలో నాకు ఓపిక ఎక్కువ. ఆ లక్షణమే ఆకాష్ పాత్రలో పరిణితి చూపించడానికి దోహదపడింది. నా పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. లవర్బాయ్ ఇమేజ్ పరిమితం కాకుండా అన్ని జోనర్లలో సినిమాలు చేస్తాను’ అన్నారు. ‘నిజాయితీగా మేము చేసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేశారు. కుటుంబమంతా కలిసి చూసేలా బాధ్యతతో కూడిన సినిమాలే భవిష్యత్తులో చేస్తాను’ అని దర్శకురాలు లక్ష్మీసౌజన్య చెప్పింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రమిదని నిర్మాత నాగవంశీ అన్నారు. సినిమా రివ్యూస్ రాసే తనను ఈ సినిమా ద్వారా నిర్మాత చినబాబు సంభాషణల రచయితగా పరిచయం చేశారని, నాగశౌర్య సహకారం వల్లే తన డైలాగ్స్కు మంచి పేరు వస్తున్నదని గణేష్ రావూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, గోసాల రాంబాబు, అర్జున్కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.