వారణాసి, మార్చి 2: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అట్టుడుకుతున్నది. ఉక్రెయిన్లో చిక్కుకొన్న భారతీయులు బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, దేశ ప్రధాని మోదీ.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. యూపీ ఎన్నికల ప్రచారం కోసం ఏకంగా మూడు రోజులు కేటాయించారు. ఉత్తరప్రదేశ్లో ఏడో విడుత అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 7న జరగనున్నాయి. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ నియోజకవర్గానికి కూడా ఈ దశలోనే ఓటింగ్ జరుగనున్నది. ప్రచారం కోసం ప్రధాని మోదీ గురు, శుక్ర, శనివారాలు అక్కడే గడపనున్నారు. రోడ్డు షోల్లో పాల్గొననున్నారు. బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కేవలం ఒక రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల కోసం దేశ ప్రధాని మూడు రోజులు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే వారణాసిలో రెండు రోజులు పర్యటించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వారం రోజుల నుంచి ఇక్కడే తిష్ఠ వేశారు. ఇంతా ఎందుకంటే.. యూపీలో యోగి సర్కారుపై వ్యతిరేకత, ప్రధాని మోదీ సభలకు పెద్దగా ఆదరణ లభించకపోవడమే. ఇటీవల మోదీ పాల్గొన్న సభలో ఖాళీ కుర్చీలు కనిపించిన నేపథ్యంలో.. ‘ఏం చేసైనా సభలకు జనాన్ని రప్పించాలి’ అని అక్కడి బీజేపీ శ్రేణులకు ఈసారి కచ్చితమైన ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి అన్ని సీట్లు (8) గెలుచుకొన్నాయి. ఈసారి అన్నింటికి అన్ని సీట్ల సంగతి పక్కన పెడితే సగం గెలిచేది కూడా అనుమానమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.