కొత్తగూడెం క్రైం, మార్చి 28: ఆ జంట ఒక్కటవ్వాలనుకున్నారు.. జన జీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం గడపాలనుకున్నారు.. మావోయిస్టు పార్టీని వీడి పోలీస్ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ సునీల్దత్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా జగ్గారానికి చెందిన మడకం కోస అలియాస్ జీవన్ 2019లో శబరి ఏరియా ఎల్వోఎస్ కమాండర్ తులసి ప్రోత్సాహంతో మావోయిస్టు పార్టీలో చేరాడు. అనతికాలంలోనే చర్ల ఏరియా ఎల్జీఎస్ మధు దళంలో సభ్యుడయ్యాడు. దళ సభ్యులు, మిలీషియా బృందాలతో కలిసి ఆదివాసీల ఇళ్ల నుంచి నిత్యావసర వస్తువులను బలవంతంగా తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో మారణాయుధాలు వినియోగించేవాడు. అలాగే భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని కిష్టారంపాడుకు చెందిన సోడి గంగి 2018లో చర్ల ఏరియా మిలీషియా కమాండర్ సోడి జోగయ్య ప్రోత్సాహంతో మావోయిస్టు పార్టీలో సభ్యురాలిగా చేరింది. 2019 నుంచి చర్ల ఎల్జీఎస్ దళ సభ్యురాలిగా చేరింది. ఆమె మావోయిస్టులకు సెంట్రీ విధులు నిర్వహించేది. వంట పనులు చేసేది. మడకం కోస అలియాస్ జీవన్, సోడి గంగికి 2019 నుంచి 2021 వరకు చర్ల ఏరియాలో చోటుచేసుకున్న బాంబు పేలుళ్లతో ప్రమేయం ఉంది. ఛత్తీస్గఢ్లోని తారేం పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెంలో ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారు. మావోయిస్టులకు ఆదివాసీల మద్దతు లేదని గుర్తించి మడకం కోస, సోడి గంగి పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులకు కల్పిస్తున్న పునరావాసం గురించి తెలుసుకుని ఆకర్షితులై పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ జంట వివాహం చేసుకుని జీవించాలనుకుంటున్నారని ఎస్పీ తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మావోయిస్టులు, మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోవచ్చని పిలుపునిచ్చారు. అనంతరం లొంగిపోయిన మావోయిస్టులకు నగదు ప్రోత్సాహకం అందజేశారు. సమావేశంలో కొత్తగూడెం ఓఎస్డీ వుప్పు తిరుపతి, భద్రాచలం ఏఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ ప్రమోద్పవార్, చర్ల సీఐ బొడ్డు అశోక్ కుమార్, ఎస్సైలు ఆలెం రవి వర్మ, వెంకటప్పయ్య పాల్గొన్నారు.