న్యూఢిల్లీ: టాటాసన్స్ ఛైర్మన్ పదవి వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తమ సంస్థ నైతిక విలువలకు లభించిన గుర్తింపు అని ఆ సంస్థ గౌరవ చైర్మన్ రతన్టాటా పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ తీర్పుతో గతంలో ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
‘అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇది గెలుపొటముల అంశం కాదు. నా ఖచ్చితత్వం, మా సంస్థ నైతిక ప్రవృత్తిపై నిర్దాక్షిణ్యంగా జరిగిన దాడి. ఈ సమయంలో టాటా సన్స్ వినిపించి వాదనలు వాస్తవాలు అని సుప్రీంకోర్టు తీర్పు తెలియజేస్తున్నది. దీంతోపాటు టాటాసన్స్ పాటించే విలువలు, నైతికతకు ఈ తీర్పు అద్దంపట్టింది. విలువలు, నైతిక ప్రమాణాలే మా సంస్థకు మార్గదర్శకత్వం వహిస్తాయి. మన న్యాయవ్యవస్థలోని గొప్పతనాన్ని ఈ తీర్పు మరింత బలపరుస్తున్నది’ అని రతన్ టాటా ట్విటర్లో పేర్కొన్నారు.
2016లో సైరస్ మిస్త్రీని ఛైర్మన్గా తొలగిస్తూ టాటాసన్స్ బోర్డు తీసుకొన్న నిర్ణయం చెల్లుబాటు కాదని 2019 డిసెంబర్ 18వ తేదీన ఎన్సీఎల్ఏటీ తీర్పు చెప్పింది. అంతేకాదు.. మిస్త్రీని తిరిగి ఛైర్మన్గా నియమించాలని సూచించింది. దీంతో ఈ తీర్పును టాటా సన్స్ గతేడాది జనవరి 2వ తేదీన సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఆ తర్వాత రతన్ టాటా కూడా ఎన్సీఎల్ఏటీ తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు.
అదేనెల 10వ తేదీన సుప్రీం కోర్టు ఎన్సీఎల్ఏటీ తీర్పుపై స్టే విధించింది. సెప్టెంబర్ 22న టాటాసన్స్లో షేర్లను షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఎక్కడా తాకట్టు పెట్టకుండా న్యాయస్థానం అడ్డుకున్నది. గతేడాది డిసెంబర్ 8వ తేదీన తుది వాదనలను విన్నది. అదే నెల 17న తీర్పును రిజర్వులో పెట్టింది.
2016 అక్టోబర్లో సైరస్ మిస్త్రీని సంస్థ చైర్మన్ పదవి నుంచి టాటా సన్స్ బోర్డు తొలిగించింది. తర్వాత ప్రస్తుత చైర్మన్ చంద్రశేఖరన్ను నియమించింది. సైరస్ మిస్త్రీని తొలగించడం కార్పొరేట్ గవర్నెన్స్ సూత్రాల ఉల్లంఘనే అవుతుందని షాపూర్జీ పల్లోంజీ వాదించింది. అయితే ఇందులో ఉల్లంఘనలు ఏవీ లేవని, మిస్త్రీని తొలగించే హక్కు బోర్డుకు ఉన్నదని టాటా సన్స్ చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.
ఇక షేర్ల విషయాన్ని మరో న్యాయ ప్రక్రియలో తేల్చుకోవాలని కూడా టాటా గ్రూప్, సైరస్ మిస్త్రీలకు సుప్రీంకోర్టు సూచించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం టాటా సన్స్కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. టాటా సన్స్లో మిస్త్రీ కుటుంబానికి 18.37 శాతం వాటా ఉంది.