శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత శ్రీమాత వైష్ణోదేవి ఆలయానికి రెండు దశాబ్దాల్లో భక్తులు 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి కానుకలు సమర్పించారు. అలాగే 2000-2020 సంవత్సరాల మధ్య రూ.2వేల కోట్ల నగదు హుండీల ద్వారా వచ్చింది. కుమావున్కు చెందిన హేమంత్ గౌనియా అనే కార్యకర్త దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. అధికారులు వివరాలు తెలిపారు. వైష్ణోదేవి ఆలయం జమ్మూ కత్రాలోని త్రికూట పర్వతాల్లో ఉంది. దేశంలో ఉన్న సంపన్న ఆలయాల్లోనూ ఇదీ ఒకటి. 108 శక్తి పీఠాల్లో ఒకటైనా ఆలయంలో దుర్గాదేవి వైష్ణోదేవిగా పూజలందుకుంటోంది.
దేశంలో ఎక్కువగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. నవరాత్రి సమయంలో కోటి వరకు వస్తుంటారు. 2000 సంవత్సరంలో 50 లక్షల మంది ఆలయాన్ని సందర్శించినట్లు ఆర్టీఐ దరఖాస్తులో అధికారులు తెలిపారు. 2011 -2012 మధ్య ఈ సంఖ్య కోటికి పెరిగింది. గత 20 ఏళ్లలో ఇదే అత్యధికం. 2018, 2019 సంవత్సరాల్లో 80 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా మహమ్మారితో గతేడాది (2020)లో కేవలం 17లక్షల మంది మాత్రమే దేవాలయాన్ని సందర్శించారు.
వైష్ణోదేవి ఆలయ బోర్డు (ఎస్ఎంవీడీఎస్బీ) నీటి సంరక్షణ, నీటి నిర్వహణను ప్రోత్సహించినందుకు ‘నేషనల్ వాటర్ అవార్డు’ 2019లో మొదటి బహుమతిని కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి అందుకుంది. అలాగే అదే ఏడాది స్వచ్ఛ భారత్ మిషన్ చొరవతో ‘బెస్ట్ స్వఛ్ ఐకానిక్ ప్లేస్’ అవార్డును అందుకోగా.. 2017లో స్వఛ్ స్వఛ్ హాయ్ సేవా ప్రచారం కింద బోర్డు ‘స్పెషల్ స్వఛ్ ఐకానిక్ ప్లేస్’ అవార్డును అందుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ప్రసాదాన్ని అందించేందుకు గతేడాది సెప్టెంబర్లో ఆన్లైన్ ‘ప్రసాద్’ సేవలను ప్రారంభించింది. భక్తులు maavaishnodevi.org వెబ్సైట్లో ప్రసాదం ఆర్డర్ ఇవ్వొచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మూతపడిన ఆలయంలోకి భక్తులను ప్రస్తుతం పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ వెలుపలి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.