మిర్యాలగూడ, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ప్లాంటు నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద టీఎస్జెన్కో ఆధ్వర్యంలో పవర్ ప్లాంటు నిర్మిస్తుండగా బీహెచ్ఈఎల్ సంస్థ పనులు చేపడుతున్నది. తెలంగాణలో కరెంట్ కొరత లేకుండా చేయడంతోపాటు మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే బృహత్తర లక్ష్యంతో 4,276 ఎకరాల్లో యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణాన్ని చేపడుతున్నారు. రూ.20,379 కోట్లతో 5 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కో యూనిట్ 800 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్తును తయారు చేసేలా ప్లాంటు నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంటుగా నిలువనున్నది. ఈ ప్లాంటు నిర్మాణంలో కీలకమైన 5 బొగ్గు ఆధారిత బాయిలర్ల పనులు వేగంగా నడుస్తున్నాయి. సుమారు 2 వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు.
విద్యుత్తు ప్లాంటు కోసం రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి ఏటా 3.5 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అడవిదేవులపల్లి సమీపంలో టెయిల్పాండ్ ప్రాజెక్టు బ్యాక్వాటర్ నుంచి నీటిని తరలించేందుకు 22 కిలోమీటర్ల మేర చేపట్టిన పైపులైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. రిజర్వాయర్ను ఒకసారి నింపితే 10 రోజులపాటు ప్లాంటు నీటి అవసరాలు తీరనున్నది.
దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంటు వరకు 8.5 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసి అలైన్మెంట్ ఖరారు చేశారు. ఈ రేల్వే లైన్ ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నది. టెండర్ ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభించనున్నారు. ఈ లైన్లో మొత్తం 14 రేక్ల (వ్యాగిన్లు) ద్వారా బొగ్గు రవాణా జరుగనున్నది. రోజుకు 50 వేల టన్నుల బొగ్గు అవసరం కానున్నది.
పవర్ ప్లాంటుకు భూసేకరణ సమయంలో భూములు ఇచ్చిన కుటుంబాలకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్లాంటు నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దామరచర్ల మండలంతోపాటు మిర్యాలగూడ నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
యాదాద్రి పవర్ ప్లాంటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 2023 డిసెంబర్ నాటికి ఐదు యూనిట్ల పనులు పూర్తి చేసి విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభిస్తాం. ఐదు యూనిట్లకు సంబంధించిన పనులు 60 శాతానికి పైగా పూర్తయ్యాయి.
– సమ్మయ్య, టీఎస్ జెన్కో సీఈ
సీఎం కేసీఆర్ దయవల్ల మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటవుతున్నది. రూ.25 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్లాంటు పనులు వేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంటు అందుబాటులోకి వస్తే విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నది.
– నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్యే