న్యూఢిల్లీ : దేశంలో 12 సంవత్సరాలు దాటిన పిల్లలకు కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల జైడస్ క్యాడిలా కంపెనీకి చెందిన జైకోవ్-డీ టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసింది. అయితే, ప్రస్తుతం పెద్దలకు ఇస్తున్న మాదిరిగానే పిల్లలకూ దశలవారీగా టీకాలు పంపిణీ చేయనున్నారు. తొలుత అనారోగ్యంతో ఉన్న పిల్లలకు, వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న పిల్లలకు వేయనున్నారు. అలాగే మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, న్యుమోనియాతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్కె అరోరా మాట్లాడుతూ, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న పిల్లలకు మొదట వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. పిల్లల వ్యాధులకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారని, దీనికి కొంత సమయం పట్టొచ్చన్నారు. సుమారు 20-25 వ్యాధులను జాబితాలో చేర్చవచ్చని అంచనా. ప్రస్తుతం పెద్దలకు టీకాలు వేస్తున్నట్లు పిల్లలకూ టీకాలు వేసే కార్యక్రమం దశలవారీగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. 12-18 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు దేశంలో 12 కోట్ల మంది ఉన్నారని, 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 94కోట్లని చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వ ప్రాధాన్యత పెద్దలకు వ్యాక్సిన్ వేయడమని.. కానీ కొద్ది వారాల్లో 12-18 మధ్య పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభమవుతుందని, పిల్లలకు జైడస్ క్యాడిలా టీకా వేయనున్నట్లు ఎన్కే అరోరా తెలిపారు. పిల్లలకు టీకాను రిజర్వ్ చేయనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారి తెలిపారు. మొదట్లో టీకా పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు సెప్టెంబర్ చివరలో లేదంటే అక్టోబర్ ప్రారంభంలో ప్రారంభమవుతుందని డాక్టర్ అరోరా పేర్కొన్నారు. సెప్టెంబర్ నాటికి భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకా సైతం ట్రయల్ పూర్తికావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, తొలి ప్రాధాన్యం మహమ్మారికి వ్యతిరేకంగా పెద్దలకు టీకాలు వేగవంతం చేయడమే ఏకైక లక్ష్యం అన్నారు. వ్యాక్సిన్ సరఫరా సక్రమంగా జరిగితే అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. దేశంలో చాలా ప్రాంతాల్లో వైరస్ నియంత్రిత స్థితిలోనే ఉందన్నారు. అందువల్ల టీకా పిల్లలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పలేమన్నారు.