15-18 ఏండ్ల వారికి మొదలైన రిజిస్ట్రేషన్
కొవిన్లో ప్రత్యేక స్లాట్ అందుబాటులోకి
దేశంలో మళ్లీ లక్షదాటిన యాక్టివ్ కేసులు
తాత్కాలిక దవాఖానలు ఏర్పాటుచేయండి
హోం ఐసొలేషన్ రోగులను పర్యవేక్షించండి
రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు
న్యూఢిల్లీ, జనవరి 1: పిల్లలకు కరోనా టీకా రిజిస్ట్రేషన్ కోసం కొవిన్ పోర్టల్లో ప్రత్యేక స్లాట్ శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 15-18 ఏండ్ల వయసు ఉన్న పిల్లలకు సోమవారం(జనవరి 3) నుంచి కరోనా టీకా వేయనున్నారు. టీకా కోసం కొవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా వ్యాక్సిన్ కేంద్రాలకే నేరుగా వెళ్లి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం ఉంది. పిల్లలకు కేవలం కొవాగ్జిన్ టీకా వేయనున్నట్టు కేంద్రప్రభుత్వం ఇప్పటికే రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చింది. ఇందుకోసం కొవాగ్జిన్ అదనపు డోసులను సరఫరా చేయనున్నది. పిల్లలకు టీకాపై ప్రధాని మోదీ డిసెంబర్ 25న ప్రకటన చేశారు. 2007లో/అంతకుముందు పుట్టిన వారు టీకా వేసుకోవడానికి అర్హులు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. పిల్లలు టీకా వేసుకొన్న తర్వాత అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రాల్లోనే ఉండాలి. వారిలో ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయా అన్నది వైద్యులు పరిశీలించి పంపిస్తారు. రెండో డోసును 28 రోజుల తర్వాత వేస్తారు. పిల్లలకు టీకా నిర్ణయాన్ని తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. కాగా, హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు ఈ నెల 10 నుంచి మూడో డోసు వేయనున్నారు.
తాత్కాలిక దవాఖానలు ఏర్పాటు చేయండి
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సదుపాయాల పరంగా రాష్ర్టాలన్నీ సన్నద్ధం కావాలని కేంద్రప్రభుత్వం రాష్ర్టాలకు సూచించింది. తాత్కాలిక దవాఖానల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ర్టాల సీఎస్లకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు(యూటీలు) లేఖ రాశారు. హోం ఐసొలేషన్లో ఉన్న రోగులను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించింది. వైద్య సదుపాయాలను పెంచుకోవడానికి డీఆర్డీవో, సీఎస్ఐఆర్, ప్రైవేటు రంగం, ఎన్జీవోలు, కార్పొరేషన్ల సాయం తీసుకోవాలన్నారు.
లక్ష దాటిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చుతున్నది. ఒమిక్రాన్తో కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 22,775 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 6 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. క్రియాశీలక కేసులు లక్ష దాటాయి. మరోవైపు, దేశంలో 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కొత్త వేరియంట్కు సంబంధించిన మొత్తం కేసుల సంఖ్య 1431కి చేరింది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా చాస్తున్నది. శనివారం కొత్తగా 2,761 కేసులు నమోదయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే ఇది 51% అధికం. ఢిల్లీలో పాజిటివిటీ రేటు వారం రోజుల వ్యవధిలో 0.55 నుంచి 3.64 శాతానికి పెరిగింది. మరోవైపు, మహారాష్ట్రలో శనివారం ఏకంగా 9,170 కొత్త కేసులు నమోదు కాగా, వాటిల్లో ఒక్క ముంబై నగరంలోనే 6,347 ఉన్నాయి.