డెహ్రాడూన్ : బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన ప్రైవేట్ రిసార్ట్లో అదృశ్యమైన రిసెప్షనిస్ట్ (19) విగతజీవిగా పడిఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడికి బీజేపీ నేతలతో సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపించడంతో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది.
యువతి హత్య కేసు దర్యాప్తు కోసం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పుల్కిత ఆర్య సహా ముగ్గురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత వివాదం నేపధ్యంలో రిసార్ట్ సమీపంలోని కాలువలోకి యువతిని తోసివేశామని దీంతో ఆమె మునిగిపోయారని పోలీస్ కస్టడీలో నిందితుడు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. యువతి హత్య కేసు విచారణపై డీఐజీపీ రేణుక దేవి సారధ్యంలో సిట్ను ఏర్పాటు చేశామని సీఎం ధామి ట్వీట్ చేశారు.
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని పేర్కొన్నారు. నిందితుడు అక్రమంగా నిర్మించిన రిసార్ట్ను శుక్రవారం రాత్రి బుల్డోజర్తో అధికారులు కూల్చివేశారని చెప్పారు. నీచమైన నేరానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు.