హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): కొవిడ్తో మరణించినవారి కుటుంబాలకు రూ.50 వేల పరిహారం ప్రకటించిన నేపథ్యంలో మరణ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. మీసేవ ద్వారా మొదటి రోజే 500కు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి కొవిడ్ డెత్ సర్టిఫికెట్లను జారీచేయనున్నది. మృతుల కుటుంబసభ్యులు పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుంచి తీసుకున్న మరణ ధ్రువీకరణ పత్రాన్ని, కొవిడ్ పాజిటివ్ రిపోర్టును దరఖాస్తుతోపాటు జత చేయాలి. పాజిటివ్ రిపోర్టు లేకపోతే, చికిత్స తీసుకున్న హాస్పిటల్ నుంచి మరణానికి కారణాన్ని ధ్రువపరిచే మెడికల్ సర్టిఫికెట్ను జత చేయాలి. ఇది కూడా లేకుంటే కరోనా చికిత్సలో చేసిన పరీక్షలు, బిల్లులు, ఇతర పత్రాలు సమర్పించాలి. బ్యాంక్ అకౌంట్, ఇతర ధ్రువపత్రాలతో రూ.50 వేల పరిహారం కోసం మరోసారి మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. నెలలోగా పరిహారం అందుతుందని అధికారులు తెలిపారు.