హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తేతెలంగాణ): పశుసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం ప్రశంసలు కురిపించింది. తెలంగాణలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పశుసంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై అధ్యయనం చేయడానికి బుధవారం ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో అధికారులతో బృందం సభ్యులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ల పనితీరును, వివిధ పశుసంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణలో ఏర్పాటుచేసిన మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ల పనితీరు, వాటి ద్వారా మూగజీవాలకు అందుతున్న సేవలను ప్రశంసించారు. ఈ బృందంలో ఉత్తరప్రదేశ్ పశుసంవర్ధకశాఖ ప్రత్యేక కార్యదర్శి మంజులత, కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ ఇంద్రామణి, రాష్ట్ర లైవ్స్టాక్ డెవలప్మెంట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్కుమార్ సింగ్ ఉన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ రామచందర్ తదితరులు పాల్గొన్నారు.