కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో, బీఎస్పీతో జట్టు కట్టి లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఈ సారి వ్యూహం మార్చింది. ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఎదుర్కోవడానికి పెద్ద పార్టీలకు బదులు చిన్న పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. గతంలో బీజేపీ దృష్టి పెట్టి సాధించిన యాదవేతర ఓబీసీ ఓట్లపై ఈ సారి ఎస్పీ గురిపెట్టింది. విస్తీర్ణపరంగా చాలా పెద్దగా ఉన్న యూపీలో ఆయా ప్రాంతాల్లో స్థానికంగా బలంగా ఉన్న చిన్న పార్టీల సాయంతో ఓట్లు రాబట్టుకొని యోగి ప్రభుత్వాన్ని పడగొట్టాలని అఖిలేశ్ యాదవ్ భావిస్తున్నారు. అందులో భాగంగానే పొత్తులపై వేగంగా పావులు కదుపుతున్నారు. బీజేపీ అంటే పడని పార్టీలతో పాటు, గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకొన్న పార్టీలను సైతం తన వైపు లాక్కొంటున్నారు. కొద్ది రోజులుగా ప్రజల్లో అఖిలేశ్కు పెరుగుతున్న మద్దతు, ఆదరణను చూసి కూడా పార్టీలు ఎస్పీ వైపు మొగ్గుతున్నాయి.
పెద్ద పార్టీల వల్ల గతంలో నష్టం
యూపీలో సమాజ్వాదీ పార్టీకి సొంతంగా అధికారంలోకి వచ్చే శక్తి ఉన్నది. అయితే గతంలో పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. స్వేచ్ఛగా హామీలు ఇవ్వలేని పరిస్థితి. అదే సమయంలో గెలవాల్సిన సీట్లు కూడా పొత్తులో భాగంగా భాగస్వామ్య పార్టీలకు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఎస్పీకి గెలుపు దూరమైంది. ఈ సారి అలా కాకూడదని అఖిలేశ్ ముందే భావించారు. చిన్న పార్టీలతో పొత్తు అయితే సీట్లపై తమదే నిర్ణాయక పాత్ర అవుతుందని, బేరమాడే అవకాశం తమకే ఎక్కువ అని ఎస్పీ ప్రతినిధి జూహీ సింగ్ అన్నారు.
ఆర్ఎల్డీ
సమాజ్వాదీ పార్టీ పొత్తు పెట్టుకొన్నవాటిలో జయంత్ చౌదరి నేతృత్వం వహిస్తున్న రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) మాత్రమే కొంచెం పెద్ద పార్టీ. ఈ పార్టీకీ ఓబీసీల మద్దతు ఉంది. పశ్చిమ యూపీలో జాట్ల మద్దతు ఉంది. అయితే గతంలో ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఆర్ఎల్డీ 30-40 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం లేదు. మిగతా ప్రాంతాల్లో ఈ ఓట్లు ఎస్పీకే వస్తాయి. ఈ పార్టీ జాట్, ముస్లిం ఓట్లను సంఘటితం చేయగలదు. మరోవైపు రైతుల మద్దతు ఎక్కువగా ఉంది.
సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ)
2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్బీఎస్పీ బీజేపీతో పొత్తు పెట్టుకొన్నది. 8 సీట్లలో పోటీ చేసి.. 4 గెలిచింది. ఈ పార్టీకి తూర్పు యూపీలో పట్టు ఉంది. రాజ్భర్లు, చౌహాన్లు, విశ్వకర్మలు, బంజారాల్లాంటి వెనుకబడ్డ కులాల మద్దతు ఉన్నది. ఈ పార్టీకి మద్దతు ఇచ్చే కులాల వారు దాదాపు 150 సీట్లలో ఉన్నారు. బీజేపీకి మిగతా ప్రాంతాల్లో ఓట్లు రావడానికి ఎస్బీఎస్పీ పొత్తు బాగా దోహదం చేసింది. ఈ సారి ఈ పొత్తు ఎస్పీకి మేలు చేయొచ్చు.
ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ(లోహియా)
2016లో విభేదాలతో దూరమైన శివపాల్ యాదవ్ మళ్లీ అఖిలేశ్తో కలిశారు. అప్పుడు ఎస్పీకి దూరమైన పార్టీ నేతలంతా మళ్లీ దగ్గరయ్యారు. శివపాల్ యాదవ్ సొంతంగా ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ(లోహియా)ని నెలకొల్పారు. ఇప్పుడు ఇద్దరూ కలవడం పార్టీలో నాయకత్వం పరంగానే కాక ఓట్లను రాబట్టుకోవడంలో ఎస్పీకి మేలు చేయనున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీటితో పాటు ఎప్పీ మహాన్ దళ్, జనవాదీ పార్టీ(సోషలిస్టు)లతో కూడా ఎస్పీ పొత్తు పెట్టుకొన్నది.