న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: కేంద్రంలోని వివిధ శాఖల్లో 8.72 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఖాళీల వివరాలను కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయమంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభకు వెల్లడించారు. కేంద్రప్రభుత్వ శాఖల్లో 2020 మార్చి 1 నాటికి 8,72,243 పోస్టులు ఖాళీగా ఉండగా.. 2019 మార్చి 1నాటికి 9,10,153 పోస్టులు ఖాళీగా ఉండేవన్నారు. 2018 మార్చి 1 నాటికి ఈ సంఖ్య 6,83,823గా ఉండేదని లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీలైన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) ద్వారా 2018-19, 2020-21లో 2,65,468 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు పేర్కొన్నారు.
21,255 గ్రూప్ ఏ పోస్టులు ఖాళీ
యూనియన్ గవర్నమెంట్ సర్వీసుల్లో 21,255 పోస్టులు ఖాళీగా ఉన్నాయని జితేంద్రసింగ్ తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహించే యూపీఎస్సీలో 485 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
ఆగస్టులో చంద్రయాన్-3 ప్రయోగం
చంద్రయాన్-3ను ఈ ఏడాది ఆగస్టులో ఇస్రో ప్రయోగించనుంది. ఈ విషయాన్ని రాజ్యసభలో జితేంద్రసింగ్ వెల్లడించారు. చంద్రయాన్-2 ప్రయోగం నుంచి తెలుసుకున్న విషయాలు, జాతీయ స్థాయి నిపుణుల సలహాల ప్రకారం చంద్రయాన్-3ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు పరీక్షలను ఇస్రో సమర్థంగా పూర్తిచేసినట్లు వివరించారు. ఈ ఏడాది దాదాపు 19 మిషన్లు చేపట్టనున్నట్టు తెలిపారు. మరోవైపు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ కేంద్రాన్ని విపక్షాలు విమర్శించాయి.
ఉపాధి హామీ బకాయిలు రూ.3,358 కోట్లు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ర్టాలకు కేంద్రం ఏకంగా రూ.3,358.14 కోట్ల బకాయిలు పడింది. ఈ మేరకు రాజ్యసభకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నిరంజన్ జ్యోతి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అత్యధికంగా పశ్చిమబెంగాల్కు రూ.752.16 కోట్లు బకాయిలు ఉండగా, ఉత్తరప్రదేశ్కు రూ.597.07 కోట్లు, రాజస్థాన్కు రూ.555.08 కోట్లు, జార్ఖండ్కు రూ.379.18, ఒడిశాకు రూ.297.85 కోట్లు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. 12 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బకాయిలు ఏమీ లేవని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100 పని దినాలను పెంచే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో ప్రభావితమైన ప్రాంతాల్లో అదనంగా 50 రోజులు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు.