ఢిల్లీ ,మే, 28: కరోనా మహమ్మారి దెబ్బకు గతేడాదే కాదు ఈ ఏడాది కూడా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు పోగా, మరికొంతమందికి వేతనాల్లో కోత పడింది. ఆ తర్వాత ఏదొక విధంగా కోలుకుంటున్నదనుకున్న సమయంలో సెకండ్ వేవ్ మరింతగా దెబ్బతీసింది. దీంతో మే నెలలో నిరుద్యోగిత రేటు డబుల్ డిజిట్కు చేరుకుంది. కరోనా లాక్ డౌన్, కఠిన నిబంధనల వల్ల దాదాపు 10 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇది అత్యధికం.
దేశంలో నిరుద్యోగిత రేటు క్రమంగా డబుల్ డిజిట్స్ దిశగా పరుగు తీస్తోంది. అంతకుముందు సుదీర్ఘ లాక్ డౌన్ విధించినప్పుడు కూడా డబుల్ డిజిట్ నిరుద్యోగిత రేటు నమోదయింది. ఈ నెల 23వ తేదీతో ముగిసిన వారానికి నిరుద్యోగిత 14.7 శాతానికి చేరుతుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఈఐ) వెల్లడించింది. గత ఏడాది మాదిరిగా పూర్తిస్థాయిలో ఆంక్షలతో కూడిన లాక్డౌన్ అమలు కాకున్నా రవాణాపై ఆంక్షలు విధించడం ప్రతికూల ఫలితాలకు దారి తీస్తున్నదని పేర్కొన్నది.
ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి నిరుద్యోగిత రేటు 8.7 శాతానికి, 16వ తేదీతో ముగిసిన వారానికి 14.3 శాతానికి పెరిగింది. కానీ, గత నెలలో అది 7.97 శాతంగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగిత రేటు పెరిగిందని సీఎంఈఐ తెలిపింది. అయితే గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు ఎక్కువగా పెరుగుతున్నది.
మే6వ తేదీ నాటికి సగటున నిరుద్యోగిత రేటు 10.2 శాతానికి చేరుకుంది. ఇది నికరంగా పెరుగుతూ వచ్చింది. మే 20వ తేదీ నాటికి 12 శాతం, 23 నాటికి 12.7 శాతంగా నమోదైందని సీఎంఈఐ తెలిపింది. అధిక సంఖ్యలో కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడం వల్ల నిరుద్యోగిత పెరుగుతున్నట్లు పేర్కొన్నది.