కీవ్, మార్చి 20: యుద్ధ ట్యాంకులు, క్షిపణి దాడులతో ఉక్రెయిన్లో రష్యా మారణహోమాన్ని సృష్టిస్తున్నది. ప్రజలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మరియుపోల్ నగరంలో నాలుగువందల మందికి పైగా తలదాచుకొన్న ఓ ఆర్ట్ స్కూల్పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో బడి పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఉన్నవారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. 200 మందికి పైగా చనిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి.
బడిలో తలదాచుకొన్నవారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. సామాన్య పౌరులు తలదాచుకొంటున్న భవనాలపై రష్యా దాడులకు పాల్పడటం ఈ వారంలో ఇది రెండోసారి. ఈ రెండు ఘటనలు మరియుపోల్లోనే జరిగాయి. బుధవారం మరియుపోల్లో 1,300 దాకా ఉన్న ఓ థియేటర్పై రష్యా క్షిపణులతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. లూహాన్స్లోని ఓబ్లాస్ట్ నగరంలో ఉన్న ఓ నర్సింగ్ హోంపై రష్యా యుద్ధట్యాంకులతో జరిపిన బాంబుదాడిలో 56 మంది చనిపోయారు. మృతుల్లో చాలా మంది వృద్ధులున్నారు. దాడి విషయాన్ని ఓబ్లాస్ట్ గవర్నర్ సెర్హీ ఆదివారం వెల్లడించారు.
రష్యా బలగాలు ఈ నెల 11నే యుద్ధ ట్యాంకులతో దాడులు చేసినప్పటికీ ఆదివారమే వివరాలు బయటకు వచ్చాయి. ఈ ప్రాంతం ఇంకా రష్యా సైనికుల ఆధీనంలోనే ఉన్నది. ఉక్రెయిన్ అధికారులు అక్కడికి చేరుకోలేకపోతున్నారు. మరోవైపు, చెర్నీవ్లో రష్యా దాడుల్లో ఆదివారం పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారని ఆ నగర మేయర్ ప్రకటించారు. ఖార్కీవ్లో జరిగిన దాడుల్లో ఐదుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. కాగా, ఉక్రెయిన్పై మళ్లీ హైపర్సానిక్ క్షిపణులతో దాడులు చేసినట్టు రష్యా ప్రకటించింది. ఇంధన నిల్వలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. దీంతో పాటు నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రంలోని తన నౌకల నుంచి ఉక్రెయిన్పై క్రూజ్ క్షిపణులతో దాడులు చేసినట్టు తెలిపింది.
రష్యా దాడుల్లో ఇప్పటివరకు 847 మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారని ఐరాస వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి కోటి మందికి పైగా శరణార్థులుగా వెళ్లారని యూఎన్హెచ్ఆర్సీ తెలిపింది. ఇప్పటివరకు 14,700 మంది రష్యా సైనికులు హతమైనట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. దీంతోపాటు 476 ట్యాంకులు, 1487 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది.
చర్చలు విఫలమైతే ప్రపంచ యుద్ధమే: జెలెన్స్కీ
మరియుపోల్ను స్వాధీనం చేసుకొనే క్రమంలో రష్యా పాల్పడ్డ యుద్ధ నేరాలను భవిష్యత్తు తరాలు వందల ఏండ్ల యినా కూడా మరిచిపోవని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఏ మాత్రం కనికరం లేని తమ చర్యలకు రష్యా తప్పక పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. యుద్ధాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. పుతిన్తో చర్చలకు తాను సిద్ధమేనని, చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని హెచ్చరించారు.
కడుపున పెట్టుకొని కాపాడుకొన్నది!
ఇంట్లో నెల కూడా నిండని పసిగుడ్డు. ఇంటి బయట రష్యా బలగాల బాంబు దాడులు. శబ్దాన్ని భరించలేక బిడ్డ ఏడుస్తున్నది. షెల్లింగ్ జరుగుతూనే ఉన్నది. రష్యా బలగాలు దగ్గరవుతున్నాయి. షెల్లింగ్ ధాటికి ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయి. డోర్లు దెబ్బతిన్నాయి. షెల్స్ గోడలను, కిటికీలను దాటుకొని లోపలికి దూసుకువస్తున్నాయి. బిడ్డను కాపాడుకోవడాని తల్లి ఓల్గా అసమాన సాహసం చేసింది. బిడ్డను పూర్తిగా పొదివి పట్టుకొన్నది. కడుపులో పెట్టుకొని నేలపై కూర్చొన్నది. పాపకు రక్షణ కవచంలా మారింది. నలువైపుల నుంచి దూసుకువస్తున్న షెల్స్ అన్నీ తల్లిని తాకి తీవ్ర గాయాలయ్యాయి. కానీ పాపకు ఒక్క చిన్న దెబ్బ కూడా తగల్లేదు. తల్లి ఓల్గా మాతృప్రేమను, బిడ్డ క్షేమం కోసం ఆమె చూపించిన తెగువను పలువురు ప్రశంసిస్తున్నారు.