లండన్: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ఉన్న రిషి సునాక్.. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. జన్మాష్టమి నేపథ్యంలో ఆయన తన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని విజిట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను తన ట్విట్టర్లో సునాక్ పోస్టు చేశారు. కృష్ణుడి పుట్టినరోజును జన్మాష్టమి పేరుతో వేడుకలు నిర్వహిస్తారని, ఆ పాపులర్ పండుగ సందర్భంగా తాను గుడికి వెళ్లినట్లు రిషి తన ట్వీట్లో తెలిపారు. రిషి, అక్షతలు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు. 2019లో హౌజ్ ఆఫ్ కామెన్స్కు ఎన్నికైన సమయంలో రిషి సునాక్.. భగవత్ గీతపై చేతులు పెట్టి ప్రమాణం చేశారు.
ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్కు, ఆ దేశ విదేశాంగ మంత్రి లిజ్ ట్రూస్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ నేతతో పాటు బ్రిటన్ ప్రధానిగా ఎవరు ఎన్నిక అవుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం.. లిజ్ ట్రూస్ సుమారు 32 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే చివర్లో టోరీ ఓటర్లు అనూహ్య రీతిలో సునాక్ వైపు మళ్లినట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ రిషి సునాక్ లీడింగ్లోకి వెచ్చినట్లు తెలుస్తోంది.