న్యూఢిల్లీ: 2019 సాధారణ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉజ్వల పథకాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందా? ఓ ఆర్టీఐ పిటిషన్కు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానాన్ని చూస్తే ఇది నిజమేననిపిస్తున్నది. గ్రామీణ పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ను ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, స్కీమ్ ప్రారంభమైన తొలి ఏడాది అంటే 2016-17లో 1,93,05,327 ఇండ్లకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వగా, 2017-18లో 1,58,69,857 కనెక్షన్లు ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ కనెక్షన్ల సంఖ్యను ఏకంగా 100 శాతం పెంచారు. అంటే 2018-19లో 3,57,64,417 ఇండ్లకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది అనూహ్యంగా కేవలం 90, 60,124 ఇండ్లకే ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ నాలుగేండ్లలో ఇచ్చిన మొత్తం గ్యాస్ కనెక్షన్లలో కూడా రాష్ర్టాలను బట్టి ఏకరూపత పాటించలేదు. ఏ రాష్ర్టాల్లోనైతే ఎన్నికలు జరుగనున్నాయో.. దాన్నిబట్టి ఆయా రాష్ర్టాలకే ఎక్కువ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇంగ్లిష్ వార్తాసంస్థ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ ఆర్టీఐ పిటిషన్ను దాఖలు చేసింది.