లక్నో: మరణించిన తల్లి మృతదేహం వద్దే అక్కాచెల్లెళ్లు ఏడాదిగా నివసించారు. (Women Living With Mother’s Dead Body ) గత వారం రోజులుగా వారు ఇంటి నుంచి బయటకు రాలేదు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లంక ప్రాంతమైన సమేంఘట్లోని మదర్వాలో నివాసిస్తున్న 52 ఏళ్ల ఉషా త్రిపాఠి అనారోగ్యంతో గత ఏడాది డిసెంబర్లో మరణించింది. ఆమె భర్త రెండేళ్ల కిందటే ఇంటిని వీడి వెళ్లిపోయాడు. ఇద్దరు కుమార్తెలైన 27 ఏళ్ల పల్లవి త్రిపాఠి, 18 ఏళ్ల వైష్విక్ త్రిపాఠి చనిపోయిన తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. తల్లి మృతదేహాన్ని ఒక గదిలో ఉంచారు. శిథిలమైన తల్లి శవం పక్కనే ఏడాదిగా నివసిస్తున్నారు.
కాగా, అక్కాచెల్లెళ్లు గత వారం రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేదు. వారి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. గమనించిన స్థానికులు ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. శిథిలావస్థకు చేరిన తల్లి మృతదేహం వద్ద పల్లవి, వైష్విక్ కూర్చొని ఉండటాన్ని గమనించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.