న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత ఏడాది ప్రతి రోజు సగటున ఇద్దరు మైనర్ అమ్మాయిలు అత్యాచారానికి గురైనట్లు ఎన్సీఆర్బీ తన తాజా రిపోర్ట్లో పేర్కొన్నది. మెట్రోపాలిటన్ నగరాల్లో ఢిల్లీలో మహిళలకు రక్షణ లేదని ఆ డేలా స్పష్టం చేసింది. 2021లో మహిళలపై ఢిల్లీలో 13,892 కేసులు నమోదు అయ్యాయి. 2020తో పోలిస్తే అది 40 శాతం ఎక్కువగా అని తేలింది. 2020లో ఢిల్లీలో కేవలం 9782 క్రైమ్ కేసులు మాత్రమే నమోదు అయినట్లు డేటా పేర్కొన్నది. దేశంలోని 19 మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో నమోదు అయిన కేసుల సంఖ్య 32.20 శాతంగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. ఢిల్లీ తర్వాత స్థానంలో ముంబై నిలిచింది. ఆ నగరంలో 5543 కేసులు నమోదు అవ్వగా, ఆ తర్వాత బెంగుళూరులో 3127 కేసులు రికార్డు అయ్యాయి. ముంబైలో 12.76 శాతం కేసులు రికార్డు అవ్వగా, బెంగుళూరులో ఆ సంఖ్య 7.2 శాతంగా ఉంది.
ఢిల్లీలో మహిళల కిడ్నాప్ సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ 3948 కిడ్నాప్ కేసులు నమోదు అయినట్లు ఎన్సీఆర్బీ డేటా స్పష్టం చేసింది. భర్త క్రూరత్వం కింద 4674 కేసులు నమోదు అయ్యాయి. ఇక బాలికల అత్యాచార కేసుల సంఖ్య 833గా ఉంది. ఈ డేటా ఆధారంగా గత ఏడాది ఢిల్లీలో ప్రతి రోజు ఇద్దరు అమ్మాయిలు రేప్కు గురైనట్లు అంచనాకు వచ్చారు. 2021లో దేశవ్యాప్తంగా 19 మెట్రో నగరాల్లో 43,414 కేసులు నమోదు అవ్వగా, దాంట్లో కేవలం ఢిల్లీలోనే 13,982 కేసులు నమోదు అయ్యాయి.