పాలకుర్తి, జూన్ 4 : మండల కేంద్రంలో వడదెబ్బతో బాలుడు ఆదివారం మృతి చెందాడు. చెందాడు. మండల కేంద్రానికి చెందిన గాదెపాక శోభన్-రేణుక దంపతులకు చెందిన గాదెపాక సన్నీ(8) శనివారం తన ఇంటి ముందు ఆడుకుంటూ అకస్మాత్తుగా పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
పెద్దవంగరలో..
పెద్దవంగర : వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన వడ్డెకొత్తపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన ఈదురు చంద్రయ్య(55) ఉదయాన్నే ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. తర్వాత మేకలను మేతకు తీసుకెళ్లాడు. ఇంటికి తర్వాత వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. బీఆర్ఎస్ నాయకులు రవి, ఉపేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
టవర్ పైనుంచి పడి ఉత్తర్ప్రదేశ్ వాసి..
కమలాపూర్ : మండలంలోని భీంపల్లి గ్రామంలో టవర్ పైనుంచి పడి ఉత్తర్ప్రదేశ్ రాష్ర్టానికి చెందిన రణధీర్కుమార్ (25) మృతి చెందినట్లు ఎస్సై సతీశ్ ఆదివారం తెలిపారు. యూపీలోని ఫతేపూర్ జిల్లా సంగోలిపూర్ మజేర్గఢ్ గ్రామానికి చెందిన రణధీర్కుమార్ టవర్ పనుల కోసం ఇక్కడికి వచ్చాడు. టవర్ పైకి ఎక్కి పనిచేస్తుండగా ఒక్కసారిగా తాడు తెగిపోవడంతో కిందపడిపోయాడు. చికిత్స కోసం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇంటి పైనుంచి పడి మరొకరు..
చిల్పూరు : మండలంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన వెలిశాల యాకయ్య(38) ఈ నెల 2వ తేదీన డాబా పైనుంచి కింద పడిపోయాడు. అప్పటి నుంచి వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కాగా, పరిస్థితి విషమించి 3వ తేదీన మృతి చెందాడు. యాకయ్య సోదరుడు వీరస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బొల్లం వినయ్కుమార్ తెలిపారు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నీటి బకెట్లో పడి బాలుడు..
పాలకుర్తి : మండల కేంద్రంలో అంగడి బజారులోని బేడబుడిగ జంగాల కాలనీకి చెందిన కడమంచి మల్లేశ్-రాములమ్మ దంపతులకు చెందిన కడమంచి దానియాలు(16 నెలలు) ప్రమాదవశాత్తు ఆదివారం నీటి బకెట్లో పడి మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల శోకంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబాన్ని సర్పంచ్ వీరమనేని యాకాంతరావు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు.