ఒట్టావా, ఏప్రిల్ 7: కెనడాలోని రెండు రాష్ర్టాల్లో ‘జాంబీ డిసీజ్’ కలకలం సృష్టిస్తున్నది. ఆల్బర్టా, సాస్కచెవాన్ రాష్ర్టాల్లోని రెండు జింకలు ఈ వ్యాధితో మరణించినట్టు అధికారులు తెలిపారు. ‘జాంబీ డిసీజ్’ను వైద్య పరిభాషలో క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ (సీడబ్ల్యూడీ)గా పిలుస్తారు. ప్రియాన్ ప్రొటీన్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. మెదడులోని కణాలను సక్రమంగా పనిచేయకుండా చేసేదే ఈ ‘ప్రియాన్ ప్రొటీన్’. ఈ వ్యాధి సోకిన జంతువుల నోటి నుంచి లాలాజలం కారుతుంది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాయి. 1960లో తొలిసారిగా వెలుగుచూసిన ఈ ‘జాంబీ డిసీజ్’ ఇప్పటివరకైతే మనుషులకు సోకినట్టు ఆధారాలు లేవు.