శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న కుమారస్వామికి ఉదయం షోడషోపచార పూజాది క్రతువులు నిర్వహించారు. ఆలయ క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చనలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం సంధ్యా సమయంలో వీరశిరోమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక పూజాధి క్రతువులు నిర్వహించారు.
సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ వేదపండితులు అర్చకులు మహా సంకల్పాన్ని పఠించారు. పంచామృతాలు ఫలోదకాలతోపాటు పుష్పోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింప జేసి పంచసూక్తం వృషభసూక్తం పఠించారు. నూతన వస్ర్తాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నివేదించి, భక్తులకు దర్శనాలు కల్పించారు.