తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. గత కొద్ది రోజులుగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి రోజుకు రెండువేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లోని టోకెన్లు జారీ చేస్తారని టీటీడీ పేర్కొంది. అయితే, ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులకు మాత్రమే ఈ అవకాశం కల్పించినట్లు చెప్పింది.
భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ టోకెన్లు పొందేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞపి చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేవస్థానం సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెన్లను మాత్రమే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తోంది. చాలా రోజులుగా సామాన్య భక్తులు స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు పడుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని కోరుతూ వస్తున్నారు. ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తుండడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.