హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): వచ్చే నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 23న ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనున్నది. రోజుకు 12 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. కాగా, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలిగా నియమించారు. తద్వారా ఉత్తర భారతదేశంలోని టీటీడీ ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలను ఆమె నిర్వర్తించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచన మేరకు బోర్డు సభ్యత్వానికి ప్రశాంతిరెడ్డి రాజీనామా చేశారు. కొవిడ్ నేపథ్యంలో గత ఏడాది మార్చి 20 నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశామని టీటీడీ తెలిపింది. వీరికి ప్రత్యేక దర్శనాల రద్దు కొనసాగుతున్నదని టీటీడీ స్పష్టంచేసింది.