తిరుమల: కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీన బెంగుళూరులో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ఆహ్వానించారు. సోమవారం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కర్ణాటక సీఎంను సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం టీటీడీ ధార్మిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 19న తిరుపతి, 22న బెంగుళూరు, 29న విశాఖపట్నం లో భారీ ఎత్తున కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.
గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం పై టీటీడీ చేస్తున్న కృషిని చైర్మన్ సీఎంకు వివరించారు. టీటీడీ చేపట్టిన హిందూ ధార్మిక కార్యక్రమాలను కర్ణాటక సీఎం బొమ్మై అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు శశిధర్, విశ్వనాథ రెడ్డి తో పాటు పలువురు కర్ణాటక మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.