హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి మొత్తం 1,128 ఆస్తులున్నాయి. 8,088 ఎకరాల 89 సెంట్ల వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఉన్నాయి. ఈ మేరకు శ్రీవారి ఆస్తులపై టీటీడీ సోమవారం స్వేతపత్రం విడుదలచేసింది. శ్వేతపత్రం విడుదల కావడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి. వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తున్న ఆస్తులు 233. వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య 895. ఈ క్యాటగిరీలో ఉన్న స్థలాలు 6,003 ఎకరాల 48 సెంట్లు. 1974 నుంచి 2014 వరకు మొత్తం 141 ఆస్తులను ( 335 ఎకరాల 23 సెంట్లు) విక్రయించగా.. టీటీడీకి రూ.6.13 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది నవంబర్ 28వ వరకు మదింపు చేసిన ఆస్తుల సంఖ్య 987. టీటీడీ ఆధీనంలో 7,753 ఎకరాల 66 సెంట్ల భూమి ఉన్నది.
ఇందులో 172 వ్యవసాయ అవసరాలకు వినియోగించే భూమి. మొత్తంగా 1,792.39 సెంట్ల వ్యవసాయ భూమి ప్రస్తుతం పాలక మండలి ఆధీనంలో ఉన్నది. టీటీడీ వద్ద 5,961 ఎకరాల 27 సెంట్ల వ్యవసాయేతర స్థలాలు ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి శ్వేతపత్రాన్ని www.tirumala. org అందుబాటులో ఉంచినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం శ్వేతపత్రాన్ని రూ పొందించినట్టు ఆయన తెలిపారు.