హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): నష్టాల బాటలో నడుస్తున్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం.. మరోవైపు పూర్తిస్థాయి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల నియామకంతో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. కొవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడం కూడా ఆర్టీసీ అదనపు ఆదాయానికి కారణం అవుతున్నది. గతంతో పోలిస్తే రోజుకు రూ.2 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టులో రోజుకు రూ.9.6 కోట్లుగా ఉన్న ఆర్టీసీ ఆదాయం.. నవంబర్ నెలకు వచ్చేసరికి కొంత పుంజుకున్నది. ఈ నెలలో రోజుకు సగటున రూ.2 కోట్ల మేర ఆదాయం పెరిగి రూ.11.50 కోట్లు సమకూరాయి. గతంతో పోలిస్తే ప్రయాణదూరం 5 లక్షల కిలోమీటర్లు పెరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ నెలలో సగటున రోజుకు 33 లక్షల కిలోమీటర్లను ఆర్టీసీ బస్సులు కవర్ చేస్తున్నాయి.