సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
ధర్పల్లి, డిసెంబర్ 29 : టీఎస్ ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకువస్తామని సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రానికి బుధవారం వచ్చిన ఆయన.. పాత బస్టాండ్ ప్రాంతంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడి సిబ్బంది ప్రవర్తన, పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకుంటే ఖర్చు ఆదా కావడంతోపాటు వాహనాల రద్దీ, కాలుష్యం కూడా తగ్గుతుందని ఈ సందర్భంగా చైర్మన్ సూచించారు. సిబ్బంది, ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడీల శ్రీరాములు రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రాజ్పాల్రెడ్డి, సర్పంచ్ పెద్ద బాల్రాజ్, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.