TSPSC Group -4 Exam | తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కమిషన్ పేర్కొన్నది. 8,039 గ్రూప్4 ఉద్యోగాలకు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నట్టు తెలిపింది. శుక్రవారం రాత్రి వరకు 9,01,051 మంది అభ్యర్థులు హాల్టికెట్లు పొందారని వెల్లడించింది.
ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఒకరోజు ముందు వరకు 95 శాతం మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకొన్నది గ్రూప్-4కు మాత్రమే. కాగా, గ్రూప్-4 పరీక్షపై 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష ఏర్పాట్లు, నిబంధనలు, పరీక్ష కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది విధులు తదితర అంశాలపై చర్చించారు. 2,878 లైజన్ ఆఫీసర్లతో కలెక్టర్లు ప్రత్యేకంగా మాట్లాడాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.