హైదరాబాద్ : ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఐకేపీ, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సీఎంకు అన్నివర్గాల మీద ఉన్న నిబద్ధతకు సాక్ష్యంగా నిలిచాయన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఉద్యోగులు కాకున్నా విధుల్లోకి తీసుకోవడం.. ఐకేపీ, మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సహా వేతనాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం సీఎం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనమన్నారు. ఆరోగ్యశాఖలో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. పారిశుధ్య ఏజెన్సీలో 16శాతం రిజర్వేషన్లు వర్తింప జేస్తూ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేయడం కేసీఆర్కు ఎస్సీలపట్ల ఉన్న ప్రేమను చాటుతుందన్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లు కల్పించినందుకు ఎర్రోళ్ల శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.