హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం నడుస్తున్నది. ఒకప్పుడు గుక్కెడు నీటి కోసం అల్లాడిన ఈ ప్రాంతం.. ఇప్పుడు ధాన్యపు సిరులతో తులతూగుతున్నది. ఇదేదో రాజకీయ నాయకులు చెప్తున్న ప్రసంగం కాదు.. ప్రతి సర్వేలోనూ వృద్ధి అంకెలతో వెల్లడవుతున్న వాస్తవాలు. తాజాగా క్రెడాయ్-అనరాక్ నివేదికలోనూ ఇదే తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో గత కొన్నేండ్లుగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో గణనీయమైన వృద్ధిరేటు నమోదవుతున్నదని ఈ నివేదిక తెలిపింది.
ప్రపంచంలోని అన్ని రంగాలను కరోనా వైరస్ కుంగదీసినప్పటికీ.. తెలంగాణ సర్కారు రైతులను ఆదుకున్న తీరును ప్రశంసించింది. దీనివల్లే వ్యవసాయరంగంపై దాని ప్రభావం చాలా తక్కువగా పడిందని కూడా నివేదికలో పేర్కొన్నది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం సైతం అభివృద్ధి చెందుతున్నదని తెలిపింది. ఇక గడిచిన ఏడేండ్లలో దేశ జీడీపీలో తెలంగాణ జీఎస్డీపీ గణనీయంగా పెరిగిందని పేర్కొన్న క్రెడాయ్-అనరాక్ నివేదిక.. తలసరి ఆదాయంలోనూ జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు 1.78 రెట్లు ఎక్కువగా ఉన్నది. ఐటీ, ఐటీ అనుబంధ ఎగుమతులు గతేడాది కంటే 12.98 శాతం వృద్ధితో రూ.1.45 లక్షల కోట్లు దాటాయి. విలువపరంగా 2020-21లో ప్రధాన పంటల ఉత్పత్తుల్లో రూ.47,125 కోట్ల మైలురాయిని తెలంగాణ చేరిందని, 2019-20తో పోల్చితే ఇది 20.9 శాతం అధికమని తెలిపింది.
ప్రాజెక్టులతోనే మహర్దశ
రాష్ట్ర ప్రభుత్వం రీ-డిజైనింగ్లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టులతోపాటు చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయతో రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖచిత్రమే మారిపోయిందని క్రెడాయ్-అనరాక్ నివేదిక తెలియజేసింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్తు సరఫరాతో రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్నదని నివేదికలో అంశాలవారీగా వివరించారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వం ముందుకొచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడం గొప్ప విషయమన్నది.
‘గతేడాది లాక్డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణవ్యాప్తంగా 6,400 కొనుగోలు కేంద్రాలను తెరిచింది. రైతులకు కూపన్లు జారీచేసి రూ.9,199 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రూ.10,167 కోట్ల విలువైన పత్తిని కూడా కొన్నది. కూరగాయలు, పండ్లు పండించిన రైతులూ
నష్టపోకుండా మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసి సుమారు 500 మెట్రిక్ టన్నుల కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారులు కొనుక్కునేలా కృషి చేసింది’
-క్రెడాయ్-అనరాక్ నివేదిక
నివేదికలోని ముఖ్యాంశాలు..