హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించిన జీవో 111పై గ్రీన్జోన్లను పరిరక్షిస్తూ, మాస్టర్ ప్లాన్ను అధ్యయనం చేస్తూ నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రస్తుతం ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ నీళ్లు హైదరాబాద్కు అవసరం లేదని, అలాంటప్పుడు ఆ చెరువుల్లోని నీళ్లు కలుషితం కాకుండా నాటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో ప్రస్తుతం అర్థరహితమని పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లోని 84 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయని, ఆ ప్రాంతంలో చేపట్టాల్సిన మాస్టర్ ప్లాన్పై నిపుణుల కమిటీ నివేదిక అందగానే జీవోను రద్దు చేస్తామని చెప్పారు. మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే వివేకానందగౌడ్ అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు.
సమస్యలు రాకుండా నిర్ణయం
జీవో 111 జీవో పరిధిలో సుమారు 1,32,600 ఎకరాల భూమి ఉన్నదని, ఒక్కసారే అంత భారీ భూమికి సంబంధించిన జీవో ఎత్తివేస్తే సమస్యలు వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అందువల్లనే నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకొంటామని వెల్లడించారు. ‘ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ నుంచి హైదరాబాద్కు మంచినీళ్లు వచ్చేవి. ఈ రెండు చెరువులు కలుషితం కాకుండా ఉండాలంటే వాటి పరిధిలో కట్టడాలపై నిషేధం విధించాలని ఉమ్మడి ఏపీలో నాటి ప్రభుత్వం నిపుణుల కమిటీ నివేదిక మేరకు నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ఈ చెరువుల నీళ్లు వాడుకొనే అవసరం లేదు. మనకు అవసరమైన నీళ్లు అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్కు సింగూరు నుంచే నీళ్లను నిలిపివేశాం. దీనికి ప్రత్యామ్నాయంగా గోదావరి నీళ్లు గానీ, కృష్ణా నీళ్లు గానీ తెస్తున్నాం. సుంకిశాల నుంచి మరో 40 టీఎంసీలు తెచ్చేందుకు రూ.15 కోట్లు మంజూరు చేశాం. దీంతో పాటు గోదావరి జలాలు మల్లన్నసాగర్ నుంచి పుష్కలంగా గ్రావిటీ ద్వారానే హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉన్నది. మరో వందేండ్ల వరకు హైదరాబాద్కు తాగునీటి సమస్య రాదు. కాబట్టి ఈ 111 జీవో అర్థరహితమైపోయింది. అయితే, ఒక్కసారే 1,32,600 ఎకరాల భూమికి సంబంధించి జీవో ఎత్తివేస్తే అక్కడ అనార్కీ వచ్చే అవకాశం ఉంటుంది. సీఎస్ను, హెచ్ఎండీఏ వాళ్లను ఇప్పటికే కోరాను. మున్సిపల్ మంత్రిని కూడా కోరుతున్నా. జీహెచ్ఎంసీలో ఏ పద్ధతిగా ఉందో అదే విధంగా అక్కడ కూడా కఠినంగా గ్రీన్జోన్స్, మాస్టర్ ప్లాన్ రోడ్స్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. నిపుణుల కమిటీ నివేదిక కూడా రావాల్సి ఉన్నది. ఆ నివేదిక అందగానే జీవో 111 ను ఎత్తివేస్తాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.