హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ నెల 29న హైదరాబాద్కు రానున్నారు. జనవరి 3 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ మేరకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం బీఆర్కేభవన్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠను, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ గుర్తింపును మరింత ఇనుమడింపజేసే అవకాశంగా భావించాలని సీఎస్ పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటన విజయవంతానికి అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. రాష్ట్రపతి నిలయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రోడ్లు మరమత్తు పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.