హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ( CPGET – 2021 ) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ ఫలితాలను విడుదల చేశారు. సీపీగెట్లో 92.51శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు లింబాద్రి తెలిపారు. ఫలితాల కోసం http://tscpget.com/CPGET వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 18, 21 నుంచి 27, అక్టోబర్ 4 నుంచి 5వ తేదీల మధ్య పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు ప్రవేశ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, జేఎన్టీయూ వర్సిటీలతో పాటు వాటి అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 78,312 మంది దరఖాస్తు చేసుకోగా, 68,836 మంది హాజరయ్యారు. ఇందులో 92.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది.