హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు టీఆర్ఎస్ సభ్యులు గురువారం ప్రమాణం స్వీకరించనున్నారు. వీరి ఎన్నికను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ధ్రువీకరించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ రాజపత్రం విడుదల చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కడియంశ్రీహరి, గుత్తా సుఖేందర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్రెడ్డి, పీ వెంకట్రామిరెడ్డి, బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వీరు ఇప్పటినుంచి ఎమ్మెల్సీలుగా పదవీ కాలం ముగిసేవరకు కొనసాగుతారని ఎన్నికల సంఘం తన గెజిట్లో స్పష్టంచేసింది. శాసనమండలి ప్రొటెం చైర్మన్ వీ భూపాల్రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు తన చాంబర్లో కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించనున్నారు.