భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 6 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రరావు (రాఘవ) పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడు హైదరాబాద్లో ఉన్నట్టు సమాచారం అందడంతో ఎనిమిది బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు పాల్వంచ ఏఎస్పీ రోహిత్రాజ్ చెప్పారు. రామకృష్ణ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా రాఘవపై ఐపీసీ 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు తెలిపారు. త్వరలో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపుతామని చెప్పారు. రాఘవపై ఉన్న పాత కేసులను కూడా పరిశీలించి దర్యాప్తు తర్వాత రౌడీషీట్ తెరుస్తామన్నారు. పాత పాల్వంచలోని నవభారత్ కాలనీలో ఉంటున్న రామకృష్ణ కుటుంబం (రామకృష్ణ, అతడి భార్య, ఇద్దరు కుమార్తెలు) ఇటీవల గ్యాస్ లీక్చేసుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. తన చావుకు వనమా రాఘవతోపాటు తన తల్లి, అక్క కారణమని రామకృష్ణ సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు. ఆ లేఖ పోలీసులకు లభించడంతో రాఘవతోపాటు మృతుడి తల్లి, అక్కపై కేసు నమోదు చేశారు. తాజాగా మృతుడి సెల్ఫీ వీడియో కూడా బయటపడింది. ఇందులో కూడా రాఘవపై ఆరోపణలు చేశారు. రామకృష్ణ బావమరిది ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన నేపథ్యంలో తన కుమారుడు వనమా రాఘవపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు తేలే వరకు అతడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిపారు. అప్పటివరకు నియోజకవర్గానికి బయటే ఉండాలని బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. రాఘవపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి విచారణకైనా సహకరిస్తామని తెలిపారు. తన ఆపరేషన్ నిమిత్తం 45 రోజులు దవాఖానలో ఉన్నానని పేర్కొన్నారు. రామకృష్ణ కుటుంబంలో జరిగిన విషాదం తనను కలిచి వేసిందని అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.