హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాన్సెన్స్ అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూసెన్స్ అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తున్నదని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి రైతులపై నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించాలని పార్లమెంటులో ప్రధాని మోదీని ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ వ్యవహారాలు లోపల ముద్దులాట బయట గుద్దులాటలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఒకే దేశం-ఒకే కొనుగోలు విధానంపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన నిలదీశారు.
దేశానికి ఐరన్ లెగ్లు
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ ఇద్దరూ దద్దమ్మలు, దేశానికి ఐరన్ లెగ్లని జీవన్రెడ్డి విమర్శించారు. ‘బీజేపీలో త్రిపుల్ ఆర్ ఉన్నట్టే, కాంగ్రెస్లో రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి రూపంలో డబుల్ ఆర్ ఉన్నారు. ఈ త్రిబుల్ ఆర్, డబుల్ ఆర్లే దేశానికి ట్రబుల్ ఆర్లుగా మారారు. రాహుల్ గాంధీ కాలుమోపిన ప్రతి చోటా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. రేవంత్రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక గాంధీభవన్ కుస్తీ భవన్గా మారింది. రేవంత్ కాంగ్రెస్లో కాలుపెట్టగానే హుజూరాబాద్లో ఆ పార్టీ ఓటుబ్యాంకు 63 వేల నుంచి 3 వేలకు పడిపోయింది అని ఎద్దేవా చేశారు. రాహుల్గాంధీ తెలంగాణపై దొంగ ప్రేమ నటిస్తున్నారని ఆరోపించారు. రాహుల్గాంధీకి రైతుల మీద ప్రేముంటే టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్లో ఉద్యమించాలని సూచించారు.
వడ్ల కొనుగోలులో పంజాబ్, హర్యానాకు ఒక నీతి, తెలంగాణకు మరో నీతా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నేతలు రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులతో పెట్టుకొన్నోళ్లు, సీఎం కేసీఆర్తో గోక్కున్నోళ్లు చరిత్రలో కలిసిపోతారని హెచ్చరించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి రూ.23 లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోచుకొన్నది. రూ.13 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన బ్యాంకు రుణాల ఎగవేతదారులను పట్టించుకోకుండా వదిలేసింది. రైతుల కోసం కేవలం రూ.13 వేల కోట్లు ఇవ్వటానికి ఏం రోగమొచ్చింది?’ అని నిలదీశారు. టీఆర్ఎస్కు రాజీనామాలు కొత్తకాదని, దమ్ముంటే రైతుల కోసం కాంగ్రెస్ నేతలు రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.