దేవరకద్ర రూరల్, నవంబర్ 30: తెలంగాణ మహిళలు ఎవరూ కూడా షర్మిలలా మాట్లాడరని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల్ల తర్వాత ఇప్పుడు అవసరం లేని పాదయాత్రలు చేస్తూ ఇక్కడి ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్నదని విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో నూతనంగా ఏర్పడిన కౌకుంట్ల మండల కేంద్రంలో తాసిల్దార్, ఎంఈవో, వ్యవసాయ శాఖ కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేకుండా పాదయాత్రలు చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా విమర్శిస్తూ మాట్లాడినా మహిళ అనే ఉద్దేశంతో పట్టించుకోలేదని కానీ సీఎం కేసీఆర్ను అసభ్యంగా, ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు సహిస్తారా అని మంత్రి ప్రశ్నించారు.
షర్మిలను అరెస్టు చేసిన విధానంపై బీజేపీ చేస్తున్న విమర్శలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ… ప్రధాని మోడీని కూడా ఇలాగే మాట్లాడితే బీజేపీ కార్యకర్తలు సహిస్తారా, ఊరుకుంటారా అని ప్రశ్నించారు. షర్మిలకు బీజేపీ అంతర్గతంగా మద్దతు ఇస్తున్నదని, ఇటీవల ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో ఆమె భేటీ అయిందని జనం అంటున్నారని మంత్రి తెలిపారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏపీకి దేవుడు కావచ్చు కానీ తెలంగాణకు మాత్రం నష్టం చేశాడు కాబట్టి ఆయనను ఎప్పటికీ ఇక్కడి ప్రజలు అభిమానించరని, అయినా కూడా ఆయన ఏవైనా మంచి పనులు చేస్తే మంచి చేశాడని అన్నామని మంత్రి తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలించిన అంశంపై మాత్రమే విమర్శలు చేశామని వ్యక్తిగతంగా ఏనాడు విమర్శించలేదని, ఆయన విగ్రహాలు కూడా ఎవరు ధ్వంసం చేయలేదన్నారు.
తెలంగాణలో ఏపీ నాయకుల విగ్రహాలు ఉన్నాయి కానీ ఏపీలో తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ఏమైనా ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని షర్మిల..ఇక్కడ పాదయాత్రల పేరిట అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఘాటుగా విమర్శలు చేశారు. మహిళలు మాట్లాడకూడని భాషను ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతోందని, తమ అభిమాన నాయకులు, మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడితే అక్కడి ప్రజలు ఊరుకుంటారా అని మంత్రి ప్రశ్నించారు. ఏపీకి వెళ్లి జగన్ ఇదే తీరుగా విమర్శిస్తే వారు ఊరుకుంటారా అని అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై దొంగ, గజదొంగ వంటి పదజాలం షర్మిల వాడుతోందని…ఆమె కుటుంబానికి 2004లో బంజారాహిల్స్లో ఉన్న ఒక్కగానొక్క ఇంటిని ఎన్నికల కోసం అమ్మేసుకున్నారని, ఇప్పుడు వారికి లక్షల కోట్లు ఎలా వచ్చాయని మంత్రి ప్రశ్నించారు. వాళ్ల తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఉన్న పథకాలను మేమేమైనా తీసేస్తే ఆ అంశాన్ని కారణంగా చూపి షర్మిల ఆందోళన చేస్తే ఒక అర్థం ఉండేదని… కానీ 24గంటల ఉచిత విద్యుత్, లక్షల ఎకరాలకు సాగునీరు, రైతుబంధు వంటి పథకాలు తాము అధికారంలోకి వచ్చాకే అమలు చేశామని గుర్తు చేశారు.
షర్మిలకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే ఏపీకి వెళ్లి ఉచిత విద్యుత్, రైతుబంధు ఇవ్వాలని పోరాటం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఏపీలో వ్యవసాయ కనెక్షన్లకు బిగిస్తున్న మీటర్ల అంశంపై పోరాటం చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్లి అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలపై నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో విమర్శలు చేసి స్థానికులకు కోపం తెప్పించి వారితో దెబ్బలు తిని సానుభూతి పొందాలని షర్మిల కుట్ర చేస్తుందని మంత్రి అన్నారు. అనంతరం నారాయణపేట జిల్లాలో నూతన ఏర్పడిన గుండుమల్, కొత్తపల్లి మండలాలను ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, తదితరులున్నారు.