సికింద్రాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 18: కేంద్రం వైఖరిపై గులాబీ సైన్యం జంగ్ సైరన్ మోగించింది. బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై కదం తొక్కింది. కర్షకులకు న్యాయం జరిగే వరకు పోరుబాటలో పయనిస్తామన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గురువారం కంటోన్మెంట్, సికింద్రాబాద్ నియోజకవర్గాల వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నాకు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. నగరంలోని ఇందిరా పార్కు వద్ద ధర్నాచౌక్లో నిర్వహించిన మహాధర్నాకు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో ఆయా వార్డుల బోర్డు మాజీ సభ్యులతో పాటు 20 బస్సుల్లో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మడ్ఫోర్ట్ ధోబీఘాట్ నుంచి జెండా ఊపి ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరుబాట తప్పదని పేర్కొన్నారు.
ధర్నాకు తరలివెళ్లిన నేతలు
పండిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాకు సికింద్రాబాద్, కంటోన్మెంట్కు చెందిన నేతలు ధర్నాచౌక్కు తరలివెళ్లారు. కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, నళినికిరణ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత,అడ్డగుట్ట, సీతాఫల్మండి, బౌద్ధనగర్, మెట్టుగూడకు చెందిన కార్పొరేటర్ల్లు పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు ధర్నాలో పాల్గొన్నారు.
రైతన్నకు అండగా కదిలిన టీఆర్ఎస్వీ
తెలంగాణ రాష్ట్ర రైతులకు అండగా నిలబడేందుకు టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీ అండగా నిలిచింది. ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రం అవలంభిస్తున్న అస్పష్ట వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఇందిరాపార్క్ కార్యక్రమానికి సంఘీభావంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ధర్నా చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు శిగ వెంకట్, భాస్కర్, కృష్ణ, నవీన్, మధు, వెంకట్, శ్రీకాంత్, నరేశ్, ప్రశాంత్, జంగయ్య, కార్తీక్, క్రాంతి, రాహుల్, నాగరాజు, శివ, అవినాశ్ పాల్గొన్నారు.
రైతులను ఆగం చేయొద్దు
ధాన్యం కొనుగోలుపై కేంద్రం రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోందని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో మరొక మాట చెబుతూ రైతుల సహనాన్ని పరీక్షిస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన కేంద్ర మంత్రులే ఇప్పుడు మాటతప్పుతున్నారని, ఇందుకు సంబంధించి అనేక ఆధారాలున్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం వరి ధాన్యం కొనాల్సిందేనన్నారు. లేదంటే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేంద్రం తీరును ఢిల్లీ వరకు ఎండగడుతామన్నారు.