అన్నదాతను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కదనరంగంలోకి దిగి యుద్ధభేరి మోగించారు. ఆరుగాలం శ్రమించి పండించే వడ్లను కేంద్రం కొని తీరాల్సిందేనని ఆ దిశగా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ గురువారం నాడు యావత్ తెలంగాణ ప్రజా ప్రతినిధులతో కలిసి ఇందిరాపార్కులో చేసిన ధర్నా విజయవంతమైంది. పోరాటాలు, కొట్లాటలు తమకు కొత్తేమీ కాదంటూ రైతులకు మద్దతుగా కేంద్రంపై సమరశంఖం పూరించారు. కేంద్రం వడ్లు కొనేదాకా కొట్లాడాలని.. గ్రామ గ్రామాన బీజేపీకి చావుడప్పు కొట్టాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. యుద్ధం ప్రారంభిస్తే చివరిదాకా పోరాడుతామని బెదిరిస్తే బెదిరిపోయేటోళ్లం కాదని ఎదురించి కొట్లాడుతామంటూ విపక్షాల తీరుపై నిప్పుల ఉప్పెన కురిపించారు. కాగా, ముఖ్యమంత్రి పిలుపు మేరకు మహాధర్నాకు రైతులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ఇందిరాపార్కుకు తరలివచ్చారు. ‘కదిలింది రైతులోకం.. బీజేపీకి తప్పదు శోకం’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. రైతుల నినాదాలతో ధర్నా చౌక్ దద్ధరిల్లింది. తెలంగాణ
నలుదిక్కులు పెక్కుటిల్లేలా కదిలి వచ్చిన రైతన్నలతో ఇందిరాపార్కు కిక్కిరిసిపోయింది.
బతకనిస్తరా?బతకనివ్వరా?
వ్యవసాయ రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.. ఎవరి కోసం నిర్లక్ష్యం చేస్తున్నారు?
అసలు కేంద్రం పాలసీ ఏమిటి? రైతులను బతకనిస్తరా? బతకనివ్వరా?
కొంటరా..? కొనరా..?
నేను ప్రధాన మంత్రి మోడీని సూటిగా అడుగుతున్నా… ఈ సభలో కూడా మీ సీఐడీలు ఉన్నరు. నేను మాట్లాడే మాట పావుగంటలో మీ టేబుల్ మీదకు వస్తది. ఆ విషయం నాకు తెలుసు.. అందుకే నేను చేతులు జోడించి ఒక్కటే మాట అడుగుతున్నా.. వడ్లు కొంటరా..? కొనరా..?
పోరాటం చేస్తాం… వదిలిపెట్టం
అవసరం అనుకుంటే.. తప్పదూ అనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రైతాంగ సమస్యల కోసం తానే లీడర్షిప్ తీసుకుంటుంది. మీ మెడలు గ్యారంటీగా వంచుతుంది.. మీ కుటిల నీతి.. మీ దుర్మార్గమైన విధానాలు, మీ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా చివరి రక్తపు బొట్టదాకా పోరాటం చేస్తాం… మిమ్ములను వదిలిపెట్టం.
జెండా లేవాల్సిందే..
ఉద్యమం రగలాల్సిందే కచ్చితంగా జెండా లేవాల్సిందే.. దేశవ్యాప్తంగా ఉద్యమం రగలాల్సిందే.. ఈ విషయాలు దేశంలో ప్రతి ఇంటికి చేరాల్సిందే. దీనికి తెలంగాణ నాయకత్వం వహించాల్సిందే. మరో పోరాటానికి తెలంగాణ సిద్ధం కావాల్సిందే.
కేంద్రం దిగిరావాలి..
రైతన్నల కష్టం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనబడటం లేనట్లుంది. ఇప్పటికైనా స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి. వెంటనే కేంద్రం దిగివచ్చి తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనాలి. లేకుంటే అన్నదాతల ఆక్రోశానికి గురికాకతప్పదు.
రైతుల ఉసురుతీయొద్దు..
ప్రతి రైతు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులను ఆగంజేయొద్దు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు రైతులకు అండగా నిలువాలి కానీ.. అనవసర ముచ్చట్లుజెప్పి రైతులు ఉసురు తీసుకునేలా ప్రవర్తించొద్దు.
పువ్వు పార్టోళ్లను ఊర్లళ్లకు రానియ్యం
ఎల్లగాలం కష్టంజేసి పంటవండిస్తే కేంద్ర ప్రభుత్వం తీరు గిట్లుంటది. ఇది పద్ధతేనా.. ఇట్ల రైతులను పట్టించుకోకపోతే.. ఢిల్లీలో ఉన్న వాళ్లకు మంచిది కాదు. ప్రతి రైతు పండించిన పంటను పక్కాగా కేంద్ర ప్రభుత్వమే కొనాలి. లేదంటే మా పువ్వు పార్టోళ్లను ఊర్లళ్లకు రానియ్యం.
కొనకుంటే లొల్లివెడుతం
పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనకపోతే… రైతులందరం కలిసి ఢిల్లీల లొల్లివెడుతం. ఆడోళ్లు, మొగోళ్లు అందరం కలిసి రైలెక్కి పోతం. మా సంగతేందో ప్రధానమంత్రికి తెలిపిస్తం.గిన్ని రోజుల నుంచి లొల్లి వెడుతుంటే ఉలుకు పలుకు లేదాయె.
గింత అన్యాయమా..
రెక్కలు ముక్కలు జేసుకొని వడ్లు పండిస్తే గింత అన్యాయం జేస్తరా.. ఇంతగానం ఇబ్బంది పెడితే రైతుల గోస తగులుతది. ఎక్కడి కల్లాల్లో అక్కడే వరి రాశులు ఉన్నయి. వర్షాలు పడుతున్నయ్. వడ్లు తడిసిపోయేటట్లున్నయ్. వడ్లను వెంటనే కొనుగోలు చేసి మా రైతులకు న్యాయంజెయ్యాలె.