బడంగ్పేట, డిసెంబర్ 29 : బీజేపీ తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పటోళ్ల కార్తీక్రెడ్డి అన్నారు. వెంకటాద్రి కాలనీలో నివాసం ఉంటున్న మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ 13 వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్ర కుమార్(నందు)ను బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరాడన్ననెపంతో నందు ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రతీకారదాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. దౌర్జన్యం చేయడం మానుకోవాలని సూచించారు.
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్కి సంపూర్ణ మద్దతు ఉన్న తర్వాత ప్రలోభపెట్టి బీజేపీ కార్పొరేటర్ను టీఆర్ఎస్లో చేర్చుకోవలసిన అవసరం లేదన్నారు. అభివృద్ధిని చూసే నరేంద్రకుమార్ టీఆర్ఎస్లో చేరారన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా మారిందని అన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలోని కందుకూరు ఎంపీపీ పదవి కాంగ్రెస్తో కలిసి ఎన్నుకున్నది వాస్తవం కాదా? అని ఆయన నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ, నిరుద్యోగుల కోసం దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు.
అభివృద్ధి చూసే టీఆర్ఎస్లోకి.. : కార్పొరేటర్ నందుకుమార్
టీఆర్ఎస్లో చేరాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని, స్వచ్ఛందంగా చేరానని 13వ డివిజన్ కార్పొరేటర్ నందకుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరానన్నారు. కార్యక్రమంలో మీర్పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మీర్పేట అధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, దీప్లాల్ చౌహన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.