వేల్పూర్ : టీఆర్ఎస్ ఇరవై ఏండ్ల ప్రస్థానం ప్రతి కార్యకర్తకు గర్వ కారణమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో బాల్కొండ నియోజక వర్గంలోని ఎనిమిది మండలాల నూతన కార్యవర్గాలను ఆయన ప్రకటించారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ అబద్దపు ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదని నిలదీసి ప్రశ్నించాలని సూచించారు. అక్రమ సొమ్ముతోఎదిగి, నకిలీ బాండ్ పేపర్తో రైతులను మోసం చేసిన అర్వింద్ తనను విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఇన్ని రోజులు ఓపిక పట్టినా..ఇక సహించేది లేదని హెచ్చరించారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఆసరా పెన్షన్ లాంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా 39 వేల ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ శాఖలతో కలుపుకొని మొత్తం లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, ఎంపీపీలు శ్రీనివాస్, ఆర్మూర్ మహేశ్, జమున, లావణ్య, సామ పద్మ, సుకన్య, లోలం గౌతమి, జడ్పీటీసీలు అల్లకొండ భారతి, పార్టీ మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.