వరంగల్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె నుంచి పార్లమెంటు దాకా ఎన్నిక ఏదైనా ప్రజలు టీఆర్ఎస్ వైపే నిలబడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో మేటిగా ఉన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే ప్రతి ఎన్నికలోనూ జై కొడుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ.. ఇలా ప్రతి ఎన్నికలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు టీఆర్ఎస్నే గెలిపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు టీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ ఇది ఆనవాయితీగా కొనసాగుతున్నది. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ కీలక విజయం సాధించింది.
అప్పటి అధికార తెలుగుదేశం పార్టీకి దీటుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 2004 ఎన్నికల్లోనూ ఇదే పరంపర కొనసాగింది. ఉమ్మడి జిల్లాలోని అప్పటి వరంగల్, హనుమకొండ లోక్సభ స్థానాలతోపాటు హనుమకొండ, చెన్నూరు, చేర్యాల, పరకాల, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల రాజీనామాతో వచ్చిన ఉపఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గెలుపు సాధించింది. ఎమ్మెల్సీతోపాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రంలో..
తెలంగాణ ఏర్పాటు నుంచీ ఉమ్మడి జిల్లా ప్రజలు టీఆర్ఎస్కే మద్దతుగా నిలుస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైన తర్వాత 2014లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది జూన్ 2న రెండు రాష్ర్టాలు ఏర్పాటవుతాయని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఆలోపే ఎన్నికలు జరగ్గా 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాలతోపాటు వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది.
సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్ వెన్నంటే నిలిచారు. ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్తోపాటు అత్యధిక మండల పరిషత్లు, గ్రేటర్ వరంగల్, ఇతర అన్ని మున్సిపాలిటీలపైనా టీఆర్ఎస్ జెండా ఎగిరింది. 2015 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు. 2015 నవంబర్ 24న వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికపై ఆసక్తి కలిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలు చెంపపెట్టులా తీర్పునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల రికార్డు మెజారిటీతో ఘన విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో టీఆర్ఎస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై సంబురాలు
రాష్ట్రంలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించడంపై ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మంగళవారం సంబురాలు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటాకులు కాల్చి మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే గెలుపు అని ఈ ఎలక్షన్ల ద్వారా మరోమారు స్పష్టమైందన్నారు.
ఎన్నిక ఏదైనా గులాబీ హవా..
2015 డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2016 మార్చి 9న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. 58 డివిజన్లలో టీఆర్ఎస్ 44 స్థానాలు గెలుచుకుని వరంగల్ నగరంపై తొలిసారి జెండా ఎగురవేసింది. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 11 స్థానాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 2019 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 2019 మేలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఆరు జిల్లా ప్రజా పరిషత్లు, 98 శాతం మండల ప్రజా పరిషత్లను టీఆర్ఎస్ దక్కించుకుంది.
2019 జూన్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి రికార్డు మెజారిటీతో గెలిచారు. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మొత్తం 9 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. 2021 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి రెండోసారి గెలిచారు. 2021 మేలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి. 66 డివిజన్లలో టీఆర్ఎస్ 48 స్థానాలు గెలిచి మరోసారి గ్రేటర్ వరంగల్ ప్రజల మద్దతు పొందింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం ఆనవాయితీగా కొనసాగుతున్నది.