హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్రోడ్డు ఉత్తరభాగం నిర్మాణం కోసం ప్రాథమిక గెజిట్(a)ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదలచేసింది. మరో వారంలో రెండవ గెజిట్(A) విడుదలయ్యే అవకాశం ఉన్నది. మొదటి గెజిట్లో భూసేకరణ అధికారులు, రింగ్రోడ్డు వెళ్లే జిల్లాలు, మండలాలు, గ్రామాల వివరాలను తెలియజేశారు. రెండో గెజిట్లో గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలను తెలియజేస్తారు. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగంలో నిర్మించే ఈ రోడ్డు 158 కిలోమీటర్లు ఉంటుంది. యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 19 మండలాలకు చెందిన 113 గ్రామాల మీదుగా రీజనల్ రింగ్ రోడు ఉత్తర భాగం నిర్మాణమవుతుంది. భూ సేకరణ అధికారులుగా ఏడుగురు ఆర్డీవోలు, ఒక అడిషనల్ కలెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. దీనికి ఆమోదం తెలిపిన కేంద్రం ఈ విషయాన్ని గెజిట్లో పొందుపరిచింది. ఏ అధికారి ఏ మండలాల్లో భూ సేకరణ చేయాలో గెజిట్లో స్పష్టంచేశారు.