సుల్తాన్ బజార్, నవంబర్ 14: గిరిజన సంస్కృతి ఎంతో గొప్పదని, ఈ సంస్కృతిని గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ, స్వామి వివేకానంద సేవా సంఘ్ ఆధ్వర్యంలో బంజారా ఉత్సవ్-2021ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన టోరి గోర్ బంజారా రేడియో, యూ ట్యూబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా జూమ్ మీటింగ్లో మాట్లాడి సభికులను ఉత్సాహపరిచారు. అనంతరం, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ బంజారా లిపిని ప్రవేశ పెట్టారు. అనంతరం, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి పురాతనమైనదని, ఎంతో గొప్పదన్నారు.
గిరిజనులకు ఎల్లప్పుడు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లను తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కమిటీ చైర్మన్ అశోక్ రాథోడ్, కో ఆర్డినేటర్ శ్రీమన్నారాయణ్ నాయక్, అధ్యక్షుడు పృథ్వి నాయక్, జాతీయ బంజారా మిషన్ అధ్యక్షుడు కృష్ణా నాయక్, ఆర్గనైజర్ వాసు నాయక్, గిరిజన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు దాసురాం నాయక్, గిరిజన విద్యార్థి నాయకులు వెంకట్ బంజార, బాలు నాయక్ పాల్గొన్నారు.