హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీదేవి లకు ట్రస్మా(తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, కోశాధికారి ఐ. వి. రమణ రావుతో కూడిన ట్రస్మా ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ను హైదరాబాద్లోని వారి నివాసంలో కలిసి ఈ మేరకు మద్దతు తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇరువురు విద్యా సంస్థలతో అనుబంధాన్ని కలిగి ఉండి విద్యా రంగ సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. కావునా ఎన్నికల అనంతరం చట్టసభల్లో తమ సమస్యలపై గళం విప్పి పరిష్కరించే దిశగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకే ట్రస్మా వీరికి మద్దతు తెలియజేస్తుందన్నారు. మార్చి 14న జరిగే పోలింగ్లో ఆయా నియోజకవర్గాల్లోని గ్రాడ్యూయేట్లు పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీదేవికి ఓటు వేయాల్సిందిగా కోరారు.