సోఫియా: స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో భారత బాక్సర్లకు కఠిన డ్రా ఎదురైంది. ఆదివారం మొదలైన టోర్నీలో మొత్తం 36 దేశాల నుంచి 450 మందికి పైగా బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. 1950లో మొదలైన ఈ టోర్నీలో యూరోప్లోనే అత్యంత పురాతన లీగ్గా పేరొందింది. భారత్ విషయానికొస్తే.. కరోనా వైరస్ విజృంభణ తర్వాత ఈ ఏడాది మన బాక్సర్లు పోటీకి దిగుతున్న ప్రధాన టోర్నీ ఇది. 2019లో పసిడి పతకంతో మెరిసిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్(52కి)కు తొలి రౌండ్లో బై లభించడంతో నేరుగా క్వార్టర్స్తో పోరు మొదలుపెట్టనుంది. మహిళల 66కిలోల కేటగిరీలో అంజలీ తుషిర్..తొలి రౌండ్లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్, రష్యా బాక్సర్ సాదత్ దల్గాతోవాతో తలపడనుంది. నిఖత్తో పాటు నందిని(81+కి) నేరుగా క్వార్టర్స్లో ఆడనుంది. పురుషుల కేటగిరీలో ఆకాశ్(67కి)కు తొలి రౌండ్లో బై లభించగా, రష్యా బాక్సర్ బిజ్మోవోతో సుమిత్(75కి) పోరు మొదలుపెట్టనున్నాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఫార్మాట్ ప్రకారం జరుగుతున్న ఈ తొలి టోర్నీలో భారత్ తరఫున 10 మంది మహిళలు, ఏడుగురు పురుష బాక్సర్లు బరిలో ఉన్నారు.