సమకాలీన భారతీయ సినిమా తాలూకు సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ ఊపందుకుంది. దీంతో అగ్ర కథానాయికలు తమ ప్రాధాన్యతల్ని మార్చుకుంటున్నారు. ఏదో ఒక భాషకు పరిమితమైతే రేసులో నిలవడం కష్టమని భావిస్తున్నారు. దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ పాన్ ఇండియా తారలుగా చలామణి కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం అగ్ర కథానాయికలందరూ ఇదే పంథాను అనుసరిస్తూ ఇటు దక్షిణాదితో పాటు అటు హిందీ చిత్రసీమలో కూడా సత్తా చాటుతున్నారు.
‘ఛలో’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన కన్నడ కస్తూరి రష్మిక మందన్న ఐదేళ్లలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా యువతకు చేరువైంది. దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో భారీ అవకాశాల్ని చేజిక్కించుకుంటూ తారాపథంలో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘పుష్ప-2’ ‘సీతా రామం’ చిత్రాల్లో నటిస్తున్నది. దళపతి విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో నాయికగా లక్కీ ఛాన్స్ కొట్టేసింది.
అదే సమయంలో ఈ అమ్మడు హిందీ సినిమాలపై కూడా దృష్టి పెడుతున్నది. ఆమె బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న ప్రేమకథా చిత్రం ‘మిషన్ మజ్ను’ ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. దీంతో పాటు అమితాబ్బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘గుడ్బై’ చిత్రంలో రష్మిక మందన్న కీలకమైన పాత్రను పోషిస్తున్నది. వరుణ్ధావన్తో ఓ సినిమా ఈ మధ్యే ఖరారైంది. దక్షిణాదిలో ప్రతిష్టాత్మక చిత్రాల్లో అవకాశాలు లభిస్తున్నప్పటికీ బాలీవుడ్కు సైతం సమ ప్రాధాన్యతనిస్తూ కెరీర్ తీర్చిదిద్దుకుంటున్నది రష్మిక మందన్న.
సినీరంగంలో పుష్కర ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది ఢిల్లీ ముద్దుగుమ్మ రాశీఖన్నా. అందం, అమాయకత్వం కలబోసిన అభినయంతో కుర్రకారు మనసుల్ని దోచుకుంది. ప్రస్తుతం ఈ సొగసరి తెలుగులో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్యతో కలిసి ‘థాంక్యూ’ చిత్రాల్లో నటిస్తున్నది. తమిళంలో ‘చిరుచిత్రంభళం’ ‘సర్దార్’ ‘సైతాన్ కా బచ్చా’ ‘మేధావి’ చిత్రాలతో బిజీగా ఉంది.
దక్షిణాదిన మంచి అవకాశాలొస్తున్నా హిందీని వదులుకోను అంటున్నది రాశీఖన్నా. ప్రస్తుతం ఈ సుందరి బాలీవుడ్లో సిద్ధార్థ మల్హోత్ర సరసన ‘యోధ’ చిత్రంలో నటిస్తున్నది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీలో తనకు మంచి బ్రేక్నిస్తుందన్న ఆశాభావంతో ఉంది రాశీఖన్నా. సినిమాలతో పాటు దర్శకద్వయం రాజ్, డీకే రూపొందిస్తున్న ఓ వెబ్సిరీస్లో కూడా రాశీఖన్నా కీలక పాత్రను పోషిస్తున్నది.
కెరీర్ ఆరంభంలో తెలుగు చిత్రసీమకే అధిక ప్రాధాన్యతనిచ్చింది పంజాబీ భామ రకుల్ప్రీత్సింగ్. ప్రస్తుతం పంథా మార్చుకొని హిందీకి పెద్దపీట వేస్తున్నది. బాలీవుడ్లో ఆమె నటిస్తున్న ‘మిషన్ సిండ్రెల్లా’ ‘డాక్టర్ జీ’ ‘థాంక్గాడ్’ ‘ఛత్రీవాలీ’ సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
పైగా ఈ సినిమాలన్నీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కావడం విశేషం. హిందీలో సెకండ్ ఇన్సింగ్స్ను మొదలుపెట్టిన ఈ అమ్మడు చక్కటి కథాబలమున్న చిత్రాల్ని మాత్రమే అంగీకరిస్తున్నది. ‘కొండపొలం’ తర్వాత తెలుగు సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న రకుల్ప్రీత్సింగ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో రూపొందనున్న ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ సినిమాలో నటిస్తున్నది.
మంగళూరు సోయగం పూజాహెగ్డే దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా జోరుమీదుంది. ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘బీస్ట్’తో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో ‘ఆచార్య’ చిత్రంలో రామ్చరణ్తో జోడీగా నీలాంబరి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో త్రివిక్రమ్-మహేష్బాబు కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో కథానాయికగా ఖరారైంది.
‘ఎఫ్-3’లో ఐటెంసాంగ్లో నర్తిస్తున్నది. టాలీవుడ్లో అదృష్టనాయికగా పేరు తెచ్చుకున్న ఈ భామ బాలీవుడ్పై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నది. రోహిత్శెట్టి దర్శకత్వంలో రణ్వీర్సింగ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ‘సర్కస్’ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమాతో పాటు హిందీలో మరికొన్ని భారీ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు.
సీనియర్ కథానాయిక తమన్నా కూడా తెలుగు, హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. తెలుగులో ‘ఎఫ్-3’తో పాటు చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ చిత్రంలో కథానాయికగా అలరించబోతున్నది. హిందీలో మధుర్భండార్కర్ దర్శకత్వంలో ఫీమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ చిత్రం ‘బబ్లీ బౌన్సర్’లో టైటిల్ రోల్ని పోషిస్తున్నది తమన్నా.